ప్రభుత్వ ఉద్యోగులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ

ఏపీలోని వివిధ ఉద్యోగ సంఘాల నేతలు విజయవాడలో రాజ్ భవన్ కు తరలివెళ్లారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను చెల్లించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ గవర్నర్ కు తెలిపారు. 

అనంతరం ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ను కలిసి అన్ని విషయాలు ఆయనకు నివేదించామని, కొన్ని అంశాలపై ఆయన సానుకూల స్పందన కనబర్చారని, పలు సందేహాలు కూడా వ్యక్తం చేశారని సూర్యనారాయణ వెల్లడించారు. ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  

ఉద్యోగుల అనుమతి లేకుండా జీపీఎస్ విత్ డ్రా చేశారని, తాము ప్రశ్నిస్తే, సాంకేతిక సమస్య కారణంగా అలా జరిగిందని అధికారులు చెబుతున్నారని సూర్యనారాయణ వివరించారు. ఇప్పటికే ఆర్థికశాఖ అధికారులు, క్యాబినెట్ ఉపసంఘానికి సమస్యలు తెలియజేశామని, కానీ వారు స్పందించకపోవడం వల్ల గవర్నర్ ను కలవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. 

ప్రభుత్వం ఆడిస్తోన్న నాలుగు స్తంభాలాట కారణంగా బకాయిల చెల్లింపులు నిలిచిపోయాయని అన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులు నిస్సహాయ స్థితిలో ఉన్నారన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని, ఆర్టికల్ 309 ద్వారా తమను ఆదుకోవాలని కోరామని తెలిపారు. ఆయన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని సూర్యనారాయణ వెల్లడించారు.

Employees
Governor
Biswabhusan Harichandan
Andhra Pradesh

More Telugu News